Devotional: ఒక్క కొబ్బరికాయ కొడితే కోర్కెలు తీరతాయా?

కొబ్బరికాయ కొడితే కోర్కెలు తీరతాయా?;

Update: 2025-06-04 03:53 GMT

Devotional: తూర్పు గోదావరి జిల్లాలోని అయినవిల్లి అనే గ్రామంలో వెలసిన ఈ సిద్ధివినాయక స్వామి ఆలయం ఒక అద్భుత గణేశ్ క్షేత్రం. ఇక్కడ గణపతి స్వయంభువుగా ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఒక్క కొబ్బరికాయ కొడితేనే మన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. అమలాపురానికి 12 కిమీ దూరంలో, రాజమహేంద్రవరానికి 60 కిమీ దూరంలో, కోనసీమలో గోదావరి తీరాన ప్రకృతి రమణీయత మధ్య నిర్మితమైన ప్రాచీన దేవాలయం ఉంది. ఇక్కడ గణేశుడు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైనది! ఈ గణపతిని నారికేళా వినాయకుడు అని కూడా పిలుస్తారు.

ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతుంటారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెపుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

ఆలయం చరిత్ర..

ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి,గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.

ప్రత్యేక పూజలు ఈ ఆలయంలో ప్రతీనెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు.

అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా మార్చి నెలలో స్వామివారికి లక్ష పెన్నులతో పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా సప్తనది జలాల అభిషేకం చేసి తరువాత లక్ష పెన్నులతో పూజా నిర్వహిచి ఆ పెన్నులను చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ పెన్నులు తీసుకునేందుకు సుదూర ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చి మరీ పెన్నులు తీసుకెళ్తారు.

Tags:    

Similar News