Raisins: ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లోపించడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామందిని వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం. అప్పుడప్పుడు వచ్చే సమస్యను తేలిగ్గానే తీసుకున్నా, అది దీర్ఘకాలికంగా మారితే మాత్రం జీర్ణవ్యవస్థ దెబ్బతిని కడుపు ఉబ్బరం, చిరాకు, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం మన ఇళ్లలో సాధారణంగా ఎండుద్రాక్ష తినాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. అయితే, ఎండుద్రాక్ష నిజంగానే మలబద్ధకాన్ని తగ్గిస్తుందా? రోజుకు ఎన్ని తినాలి? నిపుణుల సలహాలేంటో పరిశీలిద్దాం.

ఎండుద్రాక్ష మలబద్ధకాన్ని ఎలా దూరం చేస్తుంది?

న్యూఢిల్లీలోని ఎంఓసీ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ఆంకాలజీ డైటీషియన్ డాక్టర్ మాన్సీ యాదవ్ ప్రకారం.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్, సహజ కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే అధిక పీచుపదార్థం (ఫైబర్) ప్రేగుల కదలికలను సులభతరం చేసి, మలాన్ని మృదువుగా మారుస్తుంది. మలబద్ధకం వల్ల వచ్చే పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే కేవలం ఎండుద్రాక్ష తింటేనే సమస్య పూర్తిగా పోదు; వీటితో పాటు తగినంత నీరు తాగడం, పీచు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి.

నానబెట్టి తింటేనే రెట్టింపు ఫలితం

ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పూట ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంతో తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనం లభిస్తుంది. నానబెట్టడం ద్వారా వాటిలోని పోషక వ్యతిరేక సమ్మేళనాలు తగ్గి, శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా శోషించబడతాయి.

రోజుకు ఎన్ని ఎండుద్రాక్షలు తినాలి?

ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి. (100 గ్రాముల్లో దాదాపు 300 కిలో కేలరీలు, 3-4 గ్రాముల ఫైబర్, 2 మి.గ్రా ఇనుము ఉంటాయి). అందుకే పరిమాణ నియంత్రణ (పోర్షన్ కంట్రోల్) చాలా ముఖ్యం.

ఆరోగ్యవంతులు: మధుమేహం లేని సాధారణ వ్యక్తులు రోజుకు 3 నుండి 5 ఎండుద్రాక్షలు నానబెట్టి తీసుకోవచ్చు.

డయాబెటిస్ బాధితులు: షుగర్ ఉన్నవారు వీటిని రోజూ తీసుకోకూడదు. వారానికి కొన్నిసార్లు మాత్రమే రోజుకు 2 నుండి 4 గింజలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బ్లడ్ షుగర్ రీడింగ్స్ ఆధారంగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

అతిగా తింటే ప్రమాదం: మోతాదుకు మించి తింటే బరువు పెరగడం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

రక్తహీనత నివారణ: వీటిలోని ఐరన్ కంటెంట్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యం: ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన పాలీఫెనాల్స్ రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

కాంబినేషన్: బాదం, వాల్‌నట్స్, ఓట్స్ లేదా పెరుగుతో కలిపి ఎండుద్రాక్ష తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్ సమపాళ్లలో అందుతాయి.

పొట్టపై ఎండుద్రాక్షల మూటలు వేడి చేసి కట్టడం వంటి పాతకాలపు పద్ధతులను వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం మితంగా, క్రమబద్ధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మాత్రమే పూర్తి జీర్ణారోగ్యాన్ని పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Tags: