Rising Acidity Problems Among IT Employees and Youth: నేటి వేగవంతమైన జీవనశైలిలో యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఎసిడిటీ అనేది ఒక సర్వసాధారణమైన సమస్యగా మారింది. ముఖ్యంగా ఆఫీస్ పని ఒత్తిడిలో పడి సమయానికి భోజనం మానేసే ఐటీ ఉద్యోగులు, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి అలవాటుపడి రాత్రి వేళల్లో ఆలస్యంగా తినే యువత ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. గుండెల్లో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేనుపులు, వాంతులు కావడం దీని ప్రధాన లక్షణాలు.

ఎసిడిటీ రాగానే చాలామంది యాంటాసిడ్ టాబ్లెట్లు లేదా సిరప్‌లను వాడుతుంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. దీర్ఘకాలిక కడుపు ఆరోగ్యానికి జీవనశైలి మార్పులతో పాటు మన వంటింటి సుగంధ ద్రవ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో తరతరాలుగా వాడుతున్న, తేలికపాటి యాసిడ్ రిఫ్లక్స్‌ను తక్షణమే నయం చేసే ఆ 5 అద్భుతమైన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం

సోంపు గింజలు

మన ఇళ్లలో భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను నమలడం ఒక అలవాటు. ఇది కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే కాదు, అద్భుతమైన జీర్ణకారి. సోంపు గింజలు కడుపు లోపలి పొరను శాంతపరిచి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చూస్తాయి. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం లేదా సోంపు నానబెట్టిన నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం మరియు కడుపులో చికాకు తక్షణమే తగ్గుతాయి.

జీలకర్ర

ఆయుర్వేదంలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను వేగంగా ఉత్తేజపరిచి, ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగితే కడుపులో ఒత్తిడి తగ్గి యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తలెత్తదు. కడుపులో గ్యాస్, బరువుగా ఉన్నట్లు అనిపిస్తే కాసేపు జీలకర్ర నీటిని మరిగించి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అల్లం

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ జీర్ణ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కడుపులో ఉన్న ఆహారాన్ని జీర్ణకోశం గుండా వేగంగా కదిలేలా చేస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించడం వల్లే ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తాయి.

యాలకులు

యాలకులు కడుపుకు చలవ చేయడంతో పాటు ఎసిడిటీ తీవ్రతను తగ్గిస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడానికి, తిన్న ఆహారం తేలికగా అరగడానికి భోజనం తర్వాత ఒక యాలక్కాయను నమలడం చాలా మంచిది. దీనిని రెగ్యులర్ టీ లేదా పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు.

తులసి ఆకులు

తులసి ఆకులు కడుపులో అదనపు ఆమ్ల ఉత్పత్తిని అదుపు చేస్తాయి. అలాగే కడుపులోని వాపును తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడి కూడా ఎసిడిటీకి ఒక ముఖ్య కారణం కాగా తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి.

ఉదయాన్నే పరగడుపున నాలుగైదు తాజా తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం వల్ల రోజంతా ఎసిడిటీ సమస్య దరిచేరదు.

ఎసిడిటీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ అల్సర్‌లకు దారితీయవచ్చు. కాబట్టి టాబ్లెట్లపై ఆధారపడటం తగ్గించి, ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ.. సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి.

Tags: