NEET Cancelled: నీట్ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో ఎన్టీఏ సంచలనం
ఎన్టీఏ అసాధారణ నిర్ణయం
దర్యాప్తు సీబీఐకి అప్పగింత | నాసిక్లో ఒక్కరి అరెస్టు | 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష
NEET UG 2026 Cancelled: వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET UG 2026)ను జాతీయ పరీక్షల సంస్థ (NTA) రద్దు చేసింది. ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో దేశవ్యాప్తంగా పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుంది. కొత్త షెడ్యూల్ను వారం పది రోజుల్లో ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. పరీక్షల పారదర్శకతను కాపాడటం, విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ డీజీ తెలిపారు.
విద్యార్థులు, ప్రతిపక్షాల ఆగ్రహం
నీట్ రద్దుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థులు ఎన్టీఏ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పదే పదే తప్పులు జరుగుతున్నాయని, ఎన్టీఏను ప్రక్షాళన చేయాలని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
లీక్ వివరాలు
రాజస్థాన్లోని కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన ‘గెస్ పేపర్’లోని ప్రశ్నలు పరీక్షలో వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. సుమారు 410 ప్రశ్నలున్న ఆ గెస్ పేపర్లో 120 కెమిస్ట్రీ ప్రశ్నలు పరీక్షలో వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 7న ఎన్టీఏకు లీక్ సమాచారం అందగా, 8న కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందించింది.
సీబీఐ దర్యాప్తు
భారతీయ న్యాయ సంహిత కింద నేరపూరిత కుట్ర, మోసం, చోరీ, ఆధారాల ధ్వంసం కేసులు నమోదు చేసిన సీబీఐ, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం-2024 కింద కూడా కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరిన్ని అరెస్టులు జరగవచ్చని అధికారులు తెలిపారు.
ఎన్టీఏ సమర్థన
ప్రశ్నపత్రాలను వాటర్మార్క్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థతో రవాణా చేశామని, ఏఐ సీసీటీవీ నిఘా ఉందని ఎన్టీఏ వివరించింది. అయినప్పటికీ లీక్ జరగడంపై దర్యాప్తు జరుపుతున్నామని, మొత్తం ప్రశ్నపత్రం లీక్ కాలేదని భావిస్తున్నట్లు తెలిపింది.
ఈ ఘటన విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త పరీక్ష తేదీలు ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావంతో ఉన్నారు.