తెలంగాణలో త్వరలోనే 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
103 railway stations reopen in the country;
అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైల్వేస్టేషన్లలో హైదరాబాద్లోని బేగంపేట్తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు, ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ ఉన్నాయి. అమృత్ భారత్ పథకం కింద రూ 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట స్టేషన్ను కేంద్రం అభివృద్ధి చేసింది. రూ.25.41 కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కేంద్రప్రభుత్వం చేపట్టింది. రూ. 25.85 కోట్లతో కరీంనగర్ స్టేషన్ అభివృద్ధి చేసింది కేంద్రప్రభుత్వం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు.
అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన బేగంపేట రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళా ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. నారీ శక్తికి ఇది నిదర్శనమని కేంద్రమంత్రి చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో 1,300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లను కేంద్రం ఏకకాలంలో పునరాభివృద్ధి చేస్తోందన్నారు.
తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్ల తీర్చిదిద్దుతున్నామన్నారు. 2026 నాటికి, ఈ స్టేషన్లు స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి చేయబడతాయన్నారు. ఈ 40 స్టేషన్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను రూ. 720 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 350 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఈ రెండు స్టేషన్లను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ. 5,337 కోట్లు కేంద్రం కేటాయించింది.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ స్టేషన్ దసరా సందర్భంగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు అంకితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా MMTS ఫేస్-2 ఆరేడు సంవత్సరాలు ఆలస్యం అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేకపోయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో MMTS ఫేస్-2 నిర్మాణ పనులు దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్టకు MMTS ఆమోదం పొందింది. త్వరలో రూ. 400 కోట్లతో పనులు ప్రారంభమవుతాయన్నారు కిషన్ రెడ్డి.