భూమాకు చంద్రబాబు చెక్!
వివాదాస్పద నియోజకవర్గాలపై టీడీపీ నాయకత్వం దృష్టిపెట్టిందా? అక్కడ ఎమ్మెల్యేలతో నష్టం జరుగుతోందని గుర్తించిందా? అందుకే దిద్దుబాటు చర్యలకు దిగనుందా? వారి స్థానంలో ఇంచార్జ్ లకు బాధ్యతలు అప్పగించనుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్న నియోజక వర్గాలపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇంచార్జిలను నియమించడానికి కూడా టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండడం విశేషం.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. క్రమశిక్షణతో ఉండాలని సూచిస్తున్నారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేల తీరులో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే కఠిన చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరువూరు, రైల్వే కోడూరు, రాజంపేట, సింగనమల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తరచు వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి మైనస్ గా మారింతదంటున్నారు. అందుకే చాలాసార్లు హెచ్చరించినా.. ఫలితం లేకపోవడంతో వారి స్థానంలో ఇంచార్జిలను తెస్తారని తెలుస్తోంది. అదే జరిగితే విభేదాలు మరింత ముదరడం ఖాయమంటున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిల ప్రియ పరిస్థితి మరింత వివాదంగా మారుతోంది. ఇక్కడ సొంత పార్టీ శ్రేణులే ఆమె తీరును వ్యతిరేకిస్తున్నారు. అందుకే, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాసరెడ్డి నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తాత సిపి తిమ్మారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యే అఖిలప్రియకు సమీప బంధువు కూడా. అఖిల ప్రియ తీరు రోజురోజుకు వివాదంగా మారడంతో.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకోవాలని టీడీపీ హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని ఇంచార్జిగా నియమిస్తారని సమాచారం. శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. హైదరాబాద్తో పాటు రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో చికెన్ సెంటర్ల నుంచి కూడా అఖిలప్రియ అనుచరులు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ ప్రతిష్టను మరింత ఇబ్బందుల్లో పెట్టాయట. స్థానిక పార్టీ శ్రేణులు సైతం అఖిలప్రియ తీరుపై హై కమాండ్కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి పెద్దలు అక్కడ నాయకత్వం మార్పుతోనే వ్యతిరేకత తగ్గించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే శ్రీనివాస్ రెడ్డికి ఆళ్లగడ్డ నియోజకవర్గం అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.