* శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి దివ్య రథాల ఊరేగింపు

* త‌ర‌లివ‌చ్చిన 10 వేల మంది భ‌క్తులు

* హరినామ సంకీర్తన, భక్తి నృత్య ప్రదర్శనలు

* భక్తులకు మహా ప్రసాదం పంపిణీ

* ఆధ్యాత్మిక సాహిత్యం, వేద పుస్తకాల ప్రదర్శన, పంపిణీ

* పౌరాణిక వైదిక పాత్రల తోలుబొమ్మల ప్రదర్శన

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) అత్తాపూర్ ఆధ్వర్యంలో, తమ 4వ వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం 2025 జూన్ 29న హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో ఆలయ గర్భగుడిలోని శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి బయటకు వచ్చి, దివ్య రథాలపై ఊరేగింపుతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ రథయాత్ర అత్తాపూర్‌లోని ఇస్కాన్ ఆలయం నుండి మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు అత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్ 173, సామ భూపాల రెడ్డి గార్డెన్స్ వద్ద ముగిసింది. తర్వాత, సామ భూపాల రెడ్డి గార్డెన్స్, అత్తాపూర్ నందు శ్రీ హరినామ కీర్తనలు, శ్రావ్యమైన భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. పౌరాణిక వైదిక పాత్రల తోలుబొమ్మలతో రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. భక్తులందరికీ చప్పన్ (56) భోగ నైవేద్య దర్శనం కల్పించారు.

అలాగే, ఈ రథయాత్ర సందర్భంగా వేలాది భక్తులు పాల్గొని, అందమైన పూలతో అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తి శ్రద్ధలతో లాగారు. శ్రీకృష్ణుని పవిత్ర నామాలను పారవశ్యంతో పాడుతూ, నృత్యం చేస్తూ భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేల కొలది భక్త జనం శ్రీ జగన్నాథుని దివ్య దర్శనం, ఆశీస్సులను పొందారు.

Tags: