చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్న చంద్రబాబు
CM Chandrababu Naidu has been staying away from the film industry since the NDA coalition came to power.;
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, రెండు సార్లు విభజిత ఏపీలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి నుంచి ఆయనకు చిత్రపరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. అసలు ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు టాలీవుడ్ లో అగ్రస్థానంలో కొన్ని దశాబ్దాల పాటు వెలిగి చివరకు పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీకి, టాలీవుడ్ కు మధ్య సంబంధాలు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ హయాం నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా టాలీవుడ్ కు చెందిన వారిలో ఎవరో ఒకరు పార్లమెంటు సభ్యులుగా ఉండేవారు.
ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందేది. చంద్రబాబు అంటే టాలీవుడ్ కు ప్రత్యేక అభిమానం ఉంది. అదే ఆయనను టాలీవుడ్ కు దగ్గర చేసింది. సినిమాల్లో యాడ్స్ తో పాటు పాటలు ఎన్నికల ప్రచారం కోసం టాలీవుడ్ నుంచి వచ్చేవి. దర్శకులు, నిర్మాతలు, నటులు ఇలా 24 ఫ్రేమ్స్ నుంచి ఆయనకు వెన్నంటి ఉండేవారు.
బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా టాలీవుడ్ దిగ్గజాలు కలిసేవారు. చంద్రబాబు కూడా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో టాలీవుడ్ కు చెందిన వారిని నియమించేవారు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎస్వీబీసీ ఛానల్ కు ఛైర్మన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును నియమించేవారు. నాడు మురళీ మోహన్ ఎంపీగా ఉండటంతో ఆయన అంతా తానే అయి టాలీవుడ్ ను చంద్రబాబు చెంతకు చేర్చేవారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా వచ్చి చంద్రబాబును కలసి తమ సమస్యలను విన్నవించుకునే వారు.
అలాంటిది కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టాలీవుడ్ నుంచి చంద్రబాబు వద్దకు వచ్చిన వారు తక్కువేననిచెప్పాలి. హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలవడమే తప్ప ప్రత్యేకంగా అమరావతికి వచ్చి కలిసిన వారు ఎవరూ లేరు. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్. టాలీవుడ్ ను శాసిస్తున్న మెగా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం, సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ ఉండటంతో… చంద్రబాబు తనంతట తానే టాలీవుడ్ కు దూరమవుతున్నారని అంటున్నారు.
టాలీవుడ్ లో కమ్మ,కాపు సామాజిక వర్గాల మధ్య చాలా రోజులుగా వైరుధ్యాలు సాగుతున్నాయి. ప్రభుత్వంలో ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. చిత్రపరిశ్రమలో రెండు వర్గాలను కలుపుకుని పోవడం ఎంత వరకు సాధ్యమవుతుందో సినీ పెద్దలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కు సీనీ పరిశ్రమలో సమస్యలు తెలుసు. అందుకే ఆ విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం అనవసరమని భావించి చంద్రబాబు టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కల్యాణ్ హర్ట్ అవుతారేమోనని భావించి చంద్రబాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం.