టీడీపీలో బట్టబయలవుతోన్న అసంతృప్తులు

Update: 2025-05-23 05:33 GMT


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యపాత్ర పోషిస్తోన్న తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బహిరంగంగా తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు. తమ మనసులోని మాటలు బయట పెడుతున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహానాడుకు ముందుగా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పార్టీ నాయకులను ఆదేశించింది.



అయితే, పార్టీ హై కమాండ్‌ ఆదేశం మేరకు తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రదానంగా జనసేన పార్టీతో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా పార్టీ ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.



గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి అగ్ర తాంబూలం దక్కుతోంది. రాష్ట్రం మొత్తంతో పోల్చితే.. తూర్పుగోదావరి జనసేనకు పట్టున్న జిల్లా. అంతేకాదు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ జిల్లా లోని పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఆ జిల్లాలో జనసేన పార్టికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. నామినేటెడ్ పదవుల్లో సైతం ఆ పార్టీ నేతలకు పెద్దపీట వేస్తున్నారు. జనసేనతో పోల్చుకుంటే టీడీపీకి తూర్పు గోదావరి జిల్లాలో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఈ పరిణామాలను అక్కడి తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. వాళ్లయితే.. నేరుగా ఎమ్మెల్యేల వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు సైతం కలవర పాటుకు గురవుతున్నారు.



ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మహానాడు కాకినాడలో జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టారు. కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించాలని సూచించారు. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో మననం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇటీవల జనసేనకు చెందిన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు రెండు పదవులు ఇచ్చారు. పేరు పెట్టకుండా దానిని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా? అని కూడా నెహ్రూ ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు బయటకు రాలేదంటూ వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అయితే, గత కొద్దిరోజులుగా జ్యోతుల నెహ్రూ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.ఇంకోవైపు కాకినాడ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేసిన కామెంట్ సైతం సంచలనంగా మారాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టీడీపీ ఇంచాచార్జ్ ప్రకటించక పోవడాన్ని తప్పుపట్టారు. ఆ నియోజకవర్గంలో జనసేనకు భారీ మెజారిటీ లభించడం వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యకర్తలను కాపాడుకోలేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే, జనసేన విషయంలో సలహాలు ఇస్తూనే టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం కూటమిలో విభేదాలకు కారణమవుతోంది.




Tags:    

Similar News