సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలకు కసరత్తు

Update: 2025-05-21 12:46 GMT
  • ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్
  • ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలకు సిద్దమవుతున్న ప్రభుత్వం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ స్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకూ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పనితీరుపై కూటమి ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ నివేదిక తెప్పించుకుంది. అన్ని కోణాల్లో అధికారుల వ్యవహార శైలిపై పూర్తి సమాచారం కూటమి ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ నివేదిక ఆధారంగా వడపోత కార్యక్రమం జరగుతున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తప్పులు చేశారంటూ కేసులు పెట్టి ఇప్పటికే పలువురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కొందని తీవ్రమైన కేసులు పెట్టి అరెస్టులు కూడా చేసింది. అయితే ఈవిధంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం పట్ల కొంత సివిల్‌సర్వెంట్ అధికారుల్లో ప్రభుత్వ తీరుపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే విషయంపై కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హైదరాబాద్‌ లో రహస్య సమావేశమై చర్చించినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, కార్యచరణ ఏమైనా నిర్దేశించుకున్నారా అన్న విషయాలపై కూడా ప్రభుత్వం సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. పైకి ఈ సివిల్‌ సర్వెంట్ల సమావేశాన్ని పెద్దగా పట్టించుకోనట్లు కూటమి ప్రభుత్వం కనిపిస్తున్నప్పటికీ ఈవ్యవహారంపై పరోక్షంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే ఈ రహస్య సమావేశానికి టీడీపీ మద్దతు దారులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ లు కూడా హాజరవడం కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో సమర్ధులకు స్ధానం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు పలు వడపోతల అనంతరం ఒక ప్రాథమిక జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 12 నుంచి 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే 6గురు డిఐజీలు కూడా బదిలీ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఐజిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. గుంటూరు, ఏలూరు రేంజ్ లకు కొత్త పోలీస్ బాస్ లు రానున్నారని తెలుస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం కమీషనర్ మార్పు కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ బదిలీల ప్రక్రియలో ఒక రిటైర్డ్ డిజిపి చక్రం తిప్పుతున్నాట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మంచి పోస్టింగులు ఎవరికి దక్కుతాయి, లూప్ లైన్ లోకి వెళ్లేది ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే వ్యవస్ధను గాడిలో పెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ బదిలీలు ఉంటాయని సమర్ధులైన అధికారులకు తమ ప్రభుత్వంలో స్ధానం ఉంటుందనే మెస్సేజ్ ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తోంది.

Tags:    

Similar News