మాజీ ఐఏఎస్ జి.యన్.రావు మృతి
మూడు రాజధానుల కమిటీకి చైర్మన్ గా చేసిన జీఎన్.రావు;
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు గుండెపోటుతో బుధవారం హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన గృహంలో కన్ను మూశారు. జి.యన్.రావు గా ఆయన అందరికి సుపరిచితులు. వారి వయసు 77 సంవత్సరాలు. 2020లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రత్యేకంగా మూడు రాజధానుల కమిటీ వేసి జి.యన్.రావును ఆ కమిటీకి చైర్మన్ గా నియమించారు. మూడు రాజధానులే రాష్ట్ర అభివృద్ధికి దోహదం అని జి.యన్.రావు ఆధ్వర్యంలో నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎట్టి పరిస్ధితుల్లో ఆమోదయోగ్యం కాదని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులే ముద్దు అని జీవీరావు నివేదిక ఇవ్వడంతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తిరుపతితో నిర్వహించిన టీడీపీ గర్జన సభలో జి.యన్.రావును యూజ్ లెస్ ఫెలో అని చంద్రబాబు తిట్టడం అప్పట్లో సంచలనం అయ్యింది.
1988 బ్యాచ్ కు చెందిన గోపిశెట్టి నాగేశ్వరరావు గుంటూరు కలెక్టర్ గా ప్రస్థానం ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక పోస్టుల్లో పని చేశారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వేసుల శాఖ కార్యదర్శిగా చేశారు. రవాణా శాఖ, ఉన్నత విద్యా శాఖ, పౌర సరఫరాల శాఖ, టెక్స్ టైల్ శాఖ కమిషనర్ గా, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు. రిటైర్డ్ అయ్యాక అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆయన్ని శిల్పరామం స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఎక్కడున్నా ఆయన తన ఉనికిని ఏదొక విధంగా చాటేవారు! ఆయనకు నచ్చినట్లుగా చేసేవారు! చాలాసార్లు ప్రభుత్వ నిర్ణయాలు నచ్చక నిర్లక్ష్యం వహించి కొరకరాని కొయ్యగా గుర్తింపు తెచ్చుకున్నారు. రేపు శుక్రవారం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో వారి అంత్యక్రియలు జరుగుతాయి.