Iranian President Masoud Pezeshkian: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో దిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు ఆయన హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్‌ అధ్యక్షతన జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అక్టోబర్‌ 2024లో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్‌ అధ్యక్షుడు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. గతేడాది బ్రెజిల్‌ వేదికగా ఈ సదస్సు జరగగా, అనంతరం ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలను భారత్‌ స్వీకరించింది.

బ్రిక్స్‌ కూటమిలో 2024లో ఇరాన్‌తోపాటు ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ దేశాలు చేరాయి. గతేడాది ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది. రెండు నెలల క్రితం దిల్లీలో జరిగిన బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇరాన్‌ అధ్యక్షుడి  పర్యటన భారత్‌-ఇరాన్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూస్తున్నారు.

Tags: