మహానాడుకు జూనీయర్ ఎన్టీఆర్

జూనియర్ ని ఆహ్వానించాలని భావిస్తున్న మహానాడు కమిటి;

Update: 2025-05-20 07:34 GMT

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు సమయం ఆసన్నం అవుతోంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు కడపలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా కమిటీలు ఏర్పాటు చేశారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. అందుకే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఈసారి చేసే రాజకీయ తీర్మానాలు కీలకంగా మారనున్నాయి. మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీ మనుగడ సాధించేలా కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులను మహానాడులో భాగస్వామ్యం చేయనున్నారు. ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవాలని నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.తెలుగుదేశం పార్టీకి మహానాడు పండుగ లాంటిది. ఆ పార్టీ ఆవిర్భావము నుంచి నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ మరణానంతరం కూడా ఆయన జయంతి నాడు మహానాడు ను నిర్వహిస్తూ వచ్చారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కడప జిల్లాలో మహానాడు ను నిర్వహించాలని నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మహానాడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టిడిపి హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కడపలో మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు హాజరు కానున్నారు.మరోవైపు నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. అటు తరువాత పార్టీ కార్యక్రమాలతో పాటు మహానాడులోనూ పాల్గొన్నారు. 2014లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. అటు తరువాత క్రమేపి పార్టీతో పాటు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు.అయితే 2024 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచూ పార్టీలో వినిపించేది. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకోవాలని కేడర్ కోరేది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు జూనియర్ ఎన్టీఆర్ తో సహితంగా ఉండడం... వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలపై టిడిపి అంచనాలకు తగ్గట్టు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆగ్రహానికి కారణమయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. అటు తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించడంపై జూనియర్ ఎన్టీఆర్ను అందరూ అభినందించారు. ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు పిలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. మరి టిడిపి నుంచి ఆహ్వానం వెళ్తే ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News