టీడీపీలో ఇక లోకేష్ టీమ్!
తెలుగుదేశం పార్టీలో భారీగా ప్రక్షాళన మొదలవ బోతోంది. మహానాడు సందర్భంగా నారా లోకేశ్కు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న వారిని కొందరిని కొనసాగించడంతో పాటు కొత్త వారిని పార్టీ కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ పదవీ బాధ్యతలను చేపట్టనున్న సమయంలో ఆయన అనుకూలమైన టీంను చంద్రబాబు సెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తొలి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటుగా సీనియర్ నేతలను కూడా పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మాత్రమే పరిమితం చేయనున్నారని తెలిసింది. పాదయాత్ర సందర్భంగా .. నారా లోకేశ్ 2024 కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సక్సెస్ కావడానికి యువనేతలే కీలకంగా అన్ని ఏర్పాట్లు చేశారు. జనసమీకరణ దగ్గర నుంచి పాదయాత్ర తమ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కొందరు యువనేతలు మాత్రమే పర్యవేక్షించారు. లోకేశ్ టీంతో టచ్ లో ఉండి తమ నియోజకవర్గంలో పాదయాత్రతో పాటు సభలు, సమావేశాలు, వివిధ వర్గాలతో చర్చలు వంటివి సక్సెస్ చేయడంలో యువ నేతలే కీలక భూమిక పోషించారు. లోకేశ్ తన పాదయాత్ర డెయిరీలో వారి పేర్లను కూడా నియోజకవర్గాల వారీగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అందులో కొందరికి నామినేటెడ్ పోస్టులు దక్కగా, మరికొందరికి పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతతో పాటు సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా కూడా ఎంపిక చేసిన నేతలకు పదవులు ఇచ్చి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత ఐదేళ్లు అధికారంలో లేనప్పుడు యాక్టివ్ గా ఉన్న వారికి సయితం ఈ సారి పార్టీలో కీలక పదవులు వరించనున్నాయని చెబుతున్నారు. లోకేశ్ టీం వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఈ కూర్పును చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీకి చెందిన అన్ని విభాగాలను కూడా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. పార్టీ అనుబంధ విభాగాలైన విద్యార్థి, యువజన, మహిళ వంటి వాటికి కూడా కొత్త వారిని నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నియమించే కార్యవర్గం ఎన్నికల వరకూ కొనసాగుతుందని, వారి నుంచి ఫీల్డ్ లెవెల్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం తో పాటు పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను నారా లోకేశ్ చేపట్టనున్నారని అంటున్నారు. పార్టీ మొత్తాన్ని లోకేశ్ చేతుల్లో ఉంచి తాను పాలనపరమైన విషయాలను చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. సీనియర్లను తొలగించడంతో పాటు కొత్తముఖాలకు చోటు కల్పించి పార్టీ పటష్టతకు బాటలు వేయాలన్నది పార్టీ హైకమాండ్ ఆలోచనగా ఉంది.