Bihar Elections: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) బ్యాలెట్ పేపర్లపై కీలక మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు వారి కలర్ ఫొటోలను కూడా ముద్రించనున్నారు.

ఈ మార్పు కోసం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను బుధవారం ఈసీఐ సవరించింది. ఓటర్లకు సౌలభ్యంగా ఉండేలా అభ్యర్థుల కలర్ ఫొటోలు బ్యాలెట్ పేపర్‌పై కేటాయించిన స్థలంలో మూడింట రెండొంతుల వరకు ముద్రిస్తారు. అభ్యర్థుల సీరియల్ నంబర్లు, పేర్లు, నోటా ఆప్షన్‌ను 30 ఫాంట్ సైజ్‌లో బోల్డ్‌గా ముద్రించనున్నారు.

గత ఆరు నెలల్లో ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల సౌకర్యార్థం 28 మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ తాజా నిర్ణయం కూడా ఆ సవరణల్లో భాగమని పేర్కొంది. ప్రస్తుతం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ ఏడాది చివర్లో బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

Tags: