సెప్టెంబర్‌ 9వ తేదీన జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. అధికార ఎన్‌డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తోడు రాగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ప్రమోద్‌ చంద్రమోడీకి తన నామినేషన్‌ పత్రాలను సీపీరాధాకృష్ణ సమర్పించారు. ఎన్‌డీఏ నేతలందరూ సీపీరాధాకృష్ణన్‌కు మద్దతుగా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. సీపీరాధాకృష్ణన్‌కు మద్దతుగా 20 సెట్ల నామినేషన్‌ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కి సమర్పించారు. నామినేషన్‌కి ముందు ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమై ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అయితే నిన్న మంగళవారం ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ సీపీరాధాకృష్ణను ఎంపీలు అందరికీ స్వయంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా సీపీరాధాకృష్ణన్‌కు విపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని మోడీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో విపక్ష ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. రేపు గురువారం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.

Tags: