Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party - CJP) ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను పునరుద్ధరించాలని దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య గందరగోళం సృష్టించే అవకాశం ఉందనే కారణంతో ఆ ఖాతాపై నిషేధం విధించినట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. అయితే నీట్ పరీక్ష ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో నిషేధాన్ని తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అనధికారిక రాజకీయ ప్రచారం ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ఎక్స్ ఖాతాను నిలిపివేశారని దీప్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిషేధం విధించేసమయానికి ఆ ఖాతాకు సుమారు రెండు లక్షల ఫాలోవర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ పార్టీ పేరుతో వెబ్‌సైట్ కూడా ప్రారంభించినట్లు తెలియజేశారు.

ఈ తీర్పుతో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా తిరిగి క్రియాశీలం కానుంది.

Tags: