Centre Tells Supreme Court: నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో సరికొత్త భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని, వ్యవస్థ పూర్తిగా పకడ్బందీగా ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రశ్నపత్రాలు లీక్‌ కాకుండా అనేక స్థాయుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఈ వ్యవస్థను ఛేదించడం చాలా కష్టమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.

కేంద్రం ప్రకారం, ప్రశ్నల బ్యాంక్‌ను పలువురు నిపుణులు కలిసి తయారు చేస్తారు. అయితే ఏ ప్రశ్నలు చివరి పేపర్‌లోకి వస్తాయో వారికి కూడా తెలియదు. దీనివల్ల ఎవరైనా ఒక వ్యక్తి ముందుగా ప్రశ్నపత్రం విషయాలు తెలుసుకోవడం కష్టం.

ప్రశ్నపత్రాలను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థలు అమర్చారు. ఈ వాహనాల్లో జరిగే చిన్న కదలికలు కూడా రికార్డ్‌ అవుతాయి. అధికారులు ప్రధాన కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించగలుగుతారు. ప్రశ్నపత్రాలు సీల్డ్‌ ఎన్వలప్‌ల్లో, ఇనుప పెట్టెల్లో, ఒకసారి మాత్రమే ఉపయోగించే లాక్‌లతో భద్రపరుస్తారు. వాటిని రెండు వేర్వేరు ప్రభుత్వ బ్యాంకుల స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఉంచుతారు. పరీక్ష రోజు ఏ సెట్‌ను ఉపయోగించాలో నిర్ణయం ఆన్‌ది ఆన్‌సైట్‌లోనే జరుగుతుంది.

సుప్రీంకోర్టు ధర్మాసనం (న్యాయమూర్తులు పి.ఎస్‌. నరసింహ, అలోక్‌ ఆరాధే) పేపర్‌ లీక్‌లు వ్యవస్థాగత సమస్య అని, వాటిని నివారించడానికి సంస్థాగత మార్పులు అవసరమని రాధాకృష్ణన్‌ కమిటీ పేర్కొన్నది అక్షరసత్యమని వ్యాఖ్యానించింది. రాధాకృష్ణన్‌ ప్యానెల్‌, నందన్‌ నీలేకని కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఏ చర్యలు తీసుకుందో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలు బయటపడిన నేపథ్యంలో ఎన్‌టీఏ ఇప్పటికే 50 మందికి పైగా సిబ్బందిని తొలగించింది. సైబర్‌ భద్రత, ప్రశ్నపత్రాల రూపకల్పన వంటి విభాగాలకు ప్రైవేట్‌ నిపుణులను తీసుకువస్తోంది. ప్రత్యేక గదులు, ఇంటర్నెట్‌ లేని (ఎయిర్‌-గ్యాప్డ్‌) వ్యవస్థలు, భద్రతా పద్ధతులను పూర్తిగా పునర్‌ వ్యవస్థీకరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ విషయాలు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్స్‌ (FAIMA) వంటి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో వెలుగులోకి వచ్చాయి.

Tags: