Ashok Mittal Bids Goodbye to Aam Aadmi Party: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ మిత్తల్‌ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ముఖ్యంగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ తన నివాసాన్ని ఖాళీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గత ఏడాది కాలంగా కేజ్రీవాల్‌ మిత్తల్‌ అధికారిక నివాసంలోనే ఉంటూ వచ్చారు. ఇటీవల కేంద్రం కేటాయించిన కొత్త ప్రభుత్వ బంగ్లాకు కేజ్రీవాల్‌ మారిన వెంటనే, మిత్తల్‌ తన పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం గమనార్హం.

ఇటీవల ఆప్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. పలువురు ప్రముఖ నాయకులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. ఈ పరిణామంలో అశోక్ మిత్తల్‌ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ లోపలి అసంతృప్తి, నాయకత్వంపై విభేదాలు ఈ రాజీనామాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఆప్ భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది.

Tags: