అడ్డంగా దొరికిన ఐఎఎస్ లంచావతారం

IAS caught red-handed accepting Rs. 10 lakh bribe;

Update: 2025-06-09 11:45 GMT

ఒడిశాలో ఒక యువ ఐఏఎస్ అధికారి లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.. కలహండి జిల్లా ధర్మగఢ్ సబ్-కలెక్టర్‌గా పని చేస్తున్న 2021 బ్యాచ్‌కు చెందిన ధీమాన్ చక్మ‌, ఒక వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటున్న స‌మ‌యంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు ఆయనను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

విజిలెన్స్ విభాగం అధికారుల కథనం ప్రకారం.. ధీమాన్ చక్మ‌ స్థానిక వ్యాపారిని ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించి, మొత్తం రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో, ఆ వ్యాపార వేత్త ముందుగా రూ. 10 లక్షలు చెల్లించినప్పటికీ, ఆ తర్వాత విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. ఆదివారం ధీమాన్ తన ప్రభుత్వ నివాసంలో వ్యాపారి నుంచి మిగిలిన రూ. 10 లక్షల లంచం తీసుకుని, ఆ డబ్బును టేబుల్ డ్రాయర్‌లో పెడుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

లంచంగా స్వీకరించిన రూ. 10 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్ సమయంలో ఆయన నివాసం నుంచి వివిధ డినామినేషన్లలో ఉన్న 26 కట్టల కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

విజిలెన్స్ అధికారులు ధీమాన్ అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించగా అదనంగా మరో రూ. 47 లక్షల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై అవినీతి నిరోధక చట్టం 2018, సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు..

Tags:    

Similar News