అఖిలపక్ష చర్చ అనంతరమే ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి: కాంగ్రెస్ డిమాండ్

Indian National Congress: మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశ సమాఖ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించిన తర్వాతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.

రాజ్యాంగ అధికరణం 334ఏ ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని, దాని అమలుకు ముందు జనగణన నిర్వహించి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు వెళ్లాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కానీ ప్రధాని మోదీ ఆ క్రమాన్ని పాటించకుండా నియోజకవర్గాలను 50 శాతం పెంచే యత్నం చేస్తున్నారని, మహిళా రిజర్వేషన్ల గురించి పదేపదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని ఆరోపించింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో సమావేశమై ఈ అంశంపై వ్యూహం ఖరారు చేసింది. సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి తదితర అగ్రనేతలు పాల్గొన్నారు.

“మేం మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన విధానాన్నే ప్రశ్నిస్తున్నాం” అని సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ అంశాలపై ఇండియా కూటమి పార్టీల నేతలతో ఈ నెల 15న సమావేశం ఏర్పాటు చేస్తామని, 16న సభా పక్ష నేతలతో భేటీ అవుతామని వెల్లడించారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం విస్తృతంగా ఉంటుందని, దక్షిణ భారత్‌తో పాటు ఉత్తర భారత్‌లోని చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఏయే సవరణలు చేయాలనుకుంటుందో ముందుగా చెప్పి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని డిమాండ్ చేసింది.

కేంద్రం ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుండడంతో, కాంగ్రెస్ ఈ వ్యూహంతో వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాజ్యాంగ విధానాలను కాపాడుతూ, దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Tags: