146 కోట్లకు చేరుకున్న భారత దేశ జనాభా
- ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలువనున్న భారత్
- యూఎన్ డెమోగ్రాఫిక్ రిపోర్టులో వెల్లడి
వర్తమాన సంవత్సరంలో భారత దేశ జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని యూఎన్ డెమోగ్రాఫిక్ రిపోర్టులో తెలియపరిచారు. దేశంలో పునరుత్పత్తి శాతం పడిపోయినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. యూఎన్ఎఫ్పీఏ 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో జనం ఫెర్టిలిటీ లక్ష్యాలను అందుకోవడం లేదని ఆ రిపోర్టులో చెప్పారు. ఇది నిజమైన సంక్షోభంగా మారుతోందని, దీనికి గల కారణాలు కూడా భిన్నంగా ఉన్నాయని, శృంగారం.. కాంట్రాసెప్షన్, ఫ్యామిలీ అంశాల్లో అవగాహన మారడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఆ రిపోర్టులో వివరించారు. భారత్లో ఫెర్టిలిటీ రేటు తగ్గిందని, ఆ రేటు 1.9 శాతానికి తగ్గినట్లు రిపోర్టులో వెల్లడించారు. ఆ రేటు కనీసం 2.1గా ఉండాల్సి ఉంది. అంటే భారతీయ మహిళలు సగటున తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నట్లు అంచనా వేశారు. బర్త్ రేట్ స్లోగానే ఉన్నా.. దేశంలో యువత జనాభా బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. 0 నుంచి 14 ఏళ్ల వారి సంఖ్య 24 శాతంగా, 10 నుంచి 19 ఏళ్ల వారి సంఖ్య 17 శాతంగా, 19 నుంచి 24 వరకు 26 శాతంగా ఉన్నట్లు తేల్చారు. 15 నుంచి 64 ఏళ్ల వర్కింగ్ గ్రూపులో ఉన్నవారి సంఖ్య 68 శాతంగా ఉన్నట్లు తెలిసింది. 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య ఏడు శాతంగా ఉంది. అయితే భవిష్యత్తులో వయోవృద్ధుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.2025లో పుట్టిన వారి జీవన కాల అంశాన్ని నిర్దారించారు. సగటున మగవాళ్లు 71 ఏళ్లు, ఆడవాళ్లు 74 ఏళ్లు బ్రతికే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. భారత జనాభా త్వరలో 150 కోట్లకు చేరుకుంటుందని, ఆ తర్వాత 170 కోట్ల వరకు వెళ్తుందని, అయితే మరో 40 ఏళ్లలో ఆ జనాభా తరుగుదల స్టార్ట్ అవుతుందని రిపోర్టులో పేర్కొన్నారు.