Mamata Banerjee: పశ్చిమబెంగాల్‌లో ‘సర్‌’ విధుల్లో ఉన్న జ్యుడీషియల్‌ అధికారులను నిర్బంధించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. “దీనికి బాధ్యులు ఎవరో నాకు తెలియదు. నా చేతుల్లో ఏమీ లేదు” అని స్పష్టం చేశారు.

సాగర్‌దిఘిలో నిర్వహించిన బహిరంగ సభలో మమతా మాట్లాడుతూ.. “ఈ ఘటన గురించి నాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన నా చేతుల్లో లేదు. శాంతి భద్రతలు ఎన్నికల సంఘం నియంత్రిస్తోంది. వారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట వింటున్నారు. అధికారులందరినీ మార్చేశారు” అని వ్యాఖ్యానించారు.

ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (SIR)పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మమతా అన్నారు. మాల్దాలో జరిగిన ఈ హోస్టేజ్‌ ఘటన భాజపా కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. “ఓటమి భయంతో భాజపా అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది” అని ఆమె ఆవేశంగా విమర్శించారు.

ఎన్నికల సంఘం న్యాయాధికారులకు రక్షణ కల్పించడంలో విఫలమైందని మమతా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘానికి సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు చేపట్టే అనుమతి ఇచ్చింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మమతా బెనర్జీ వ్యాఖ్యలు భాజపా-తృణమూల్‌ మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.

Tags: