Post Boxes : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కనుమరుగవుతున్న పోస్ట్ డబ్బాలు
ఎన్నో తరాల భావోద్వేగాలు ముడిపడి ఉన్న ఉత్తరాల పెట్టికి ఇక సెలవు;
అనేక దశాబ్ధాలుగా భారతీయులకు ఆ పొడవాటి ఎర్రటి పెట్టి ఒక ఎమోషన్. ఎన్నో తరాల భావోద్వేగాలు ఆపెట్టితో ముడిపడి ఉన్నాయి. తల్లితండ్రుల క్షేమ సమాచారాలు బిడ్డలకు తెలవాలన్నా, బిడ్డల ఆనుపానులు తల్లితండ్రులకు తెలవాలన్నా, మంచి చెడుల వార్తలు ప్రజలకు చేరవేయాలన్నా ఆ పెట్టే శరణ్యం. స్నేహితల మధ్య సమాచార వారధిగా ఆ పెట్టి అందించిన సేవలు ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమే. అంతగా భారతీయుల జీవితాల్లో 171 సంవత్సరాలుగా పెనవేసుకోపోయిన ఆ పెట్టి ఇక కనిపించదు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమాచార సాధనాలు ఇంతగా వాడుకలోకి రాకముందు సమాచార బట్వాడాకు భారతీయులకు ఉన్న ఏకైక సాధనం పోస్ట్ బాక్స్. ఇప్పుడు ఆ పోస్టుబాక్స్ ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కనుమరుగైపోతోంది. ఆధునిక సమాచార వ్యవస్ధ దేశంలో వేళ్ళూనుకున్నాక కూడా దాదాపు మూడు దశాబ్ధాల పాటు తన ఉనికిని చాటుకున్న దాదాపు 5 లక్షల పోస్టు బాక్సులు ఇక దేశవ్యాప్తంగా మనకు కనిపించవు. ఇక సెలవు అంటూ ఉత్తరాల డబ్బా వెళ్లిపోతోంది.
మన దేశంలో పోస్టల్ వ్యవస్ధ 1854వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మన తాత, ముత్తాలకు, తండ్రులకు అత్యంత విశ్వసనీయమైన సమాచార నెచ్చెలి పోస్ట్ డబ్బా. భారత దేశంలో ఏ మూలకు వెళ్లినా ఒక స్ధంభానికో, ఒక ఇంటి గోడకో, లేక పోస్టాఫీసుల ముందో నిగనిగలాడుతూ ఎర్రగా మెరిపోతూ కనిపించేది పోస్ట్ బాక్స్. ఎన్నో కోట్ల మందికి నిత్యం సమాచార చేరేవేసే పెట్టెగా భారతీయ సమాజంలో అంతర్భాగం అయ్యింది ఈ ఉత్తరాల పెట్టె. తన ద్వారా ఎంతో మందికి సంతోషలను పంచే కబుర్లు చేరవేసేది. ఎన్నో కుటుంబాల దుఖాలను పంచుకునేది, ఎందరో నిరుద్యోగ యువతకు అపాయింట్మెంట్ ఆర్డర్లు తనలో దాచుకుని చేరవేసేది. అటువంటి సంతోషాల మిత్రుడు, మన కుటుంబ సభ్యుడు లాంటి పోస్ట్ బాక్స్ ఇకపై మనకు ఎక్కడా కనిపించదు.
దేశ, విదేశాల్లో ఎక్కో సప్త సముద్రాల అవతల ఉన్న బంధుమిత్రులకు మన క్షేమ సమచారాలను మోసుకు వెళ్ళేది. అలాగే వారి నుంచి మనకు సమాచారం తీసుకు వచ్చే సాధనం పోస్ట్ బాక్స్. ఎన్నో శుభవార్తలు, మరెన్నో శుభలేఖలు, ఫలితాలు, ఉద్యోగాలు వచ్చాయనే తీపి కబుర్లను తన పొత్తి కడుపులో పెట్టుకుని మనకు చేరవేసే పోస్ట్ బాక్స్ కేవలం ఎర్రడబ్బానే కాదు మన మనసుల్లో పెనవేసుకుపోయిన ఒక ఎమోషన్. కాస్త ఈ ఉత్తరం వీధి చివరన ఉన్న పోస్ట్ డబ్బాలో వేసి వెళ్ళరా అని మన తల్లిదండ్రులు, తాతలు, సోదర, సోదరీ మణుల నోటి నుంచి వినని వారు 90వ దశకం ముందు పుట్టిన వారు ఎవ్వరూ ఉండి ఉండరు. అలా ప్రతి నిత్యం మనం పలకరించే మన నేస్తం ఈ ఎర్ర ఉత్తరాల పెట్టి. అధునిక సాంకేతక సమాచార విప్లవంతో మనకు దాదాపు రెండు దశాబ్ధాల నుంచి కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, కవర్లు అన్నీ మాయమైపోయాయి. ప్రజలు కూడా వీటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించేశారు. దీంతో ఇక ఎర్ర పోస్ట్ డబ్బాల అవసరం లేకుండా పోయింది. దీంతో పోస్టు డబ్బాల వ్యవస్ధను ఎత్తివేయాలని పోస్ట్ శాఖ విధాన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.
అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పోస్టు డబ్బా ఏదో రేకు పెట్టెలా ఉండేది కాదు. చాలా బరువుగా మందమైన ఇనుముతో దీన్ని రూపొందించారు. ఈ పోస్ట్ బ్బాను వర్షాలు ఏమీ చేయలేవు, ఎంతటి ఈదురు గాలైనా ఈ ఎర్రపెట్టెను ఇంచు కూడా కదపలేదు. తుఫాను వచ్చినా డబ్బాలోకి చుక్క నీరు చేరదు. మనం డబ్బాలో వేసిన లెటర్లు, కవర్లను వీటన్నింటి నుంచీ కాపాడి అంత్యం భద్రంగా తనలో దానలో దాచుకుని మనం రాసిన చిరునామాలకు సురక్షితంగా చేరుస్తుంది. ముప్పేట వర్షం కురుస్తున్న డబ్బాలో ఉన్న ఒక్క లెటర్కి కూడా కనీసం చెమ్మ పట్టకుండా ఈ పోస్ట్ డబ్బాను ఎవరు సృష్టించారో కానీ వారికి వేనవేల దండాలు.