Sunetra Pawar: అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా ఎదగనున్నారు. శనివారం (జనవరి 31) సాయంత్రం ఆమె పదవీ స్వీకార ప్రమాణ స్వీకరణ జరిగే అవకాశం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వర్గాలు తెలిపాయి.

ముంబయిలోని విధాన్ భవన్‌లో ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగి సునేత్రా పవార్‌ను పక్ష నాయకురాలిగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌లో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్‌సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ శుక్రవారం మాట్లాడుతూ సునేత్రా పవార్‌ను పక్ష నాయకురాలిగా ఎన్నుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేశారు.

అజిత్ పవార్ ఆకస్మిక మృతి నేపథ్యంలో ఎన్‌సీపీ చీలిక వర్గాల మధ్య పునరేకీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. అజిత్ పవార్ జీవించి ఉండగానే శరద్ పవార్ వర్గంతో చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. పుణె, చించ్వాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పోటీ చేశాయి. శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్‌తో కూడా సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. భాజపా సీనియర్ నేతలకు ఈ పరిణామాలు తెలుసని వర్గాలు పేర్కొన్నాయి.

పునరేకీకరణ జరిగితే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని చేపట్టే అవకాశం ఉంది. అయితే సునేత్రా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే పునరేకీకరణ ప్రయత్నాలపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

మరోవైపు అజిత్ పవార్ మరణానికి కారణమైన విమాన ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభించింది. బారామతిలో జరిగిన ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వచ్చే నెల శాసనసభ సమావేశాల్లో 2026-27 బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది. అజిత్ పవార్ ఆర్థిక శాఖను నిర్వహించడం వల్ల ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రక్రియపై దృష్టి సారించారు.

Tags: