మార్కెట్లోకి తెలంగాణ బ్రాండ్ బియ్యం
Telangana government plans to sell quality rice in the market under the Telangana brand name;
తెలంగాణ బ్రాండ్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్లో విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీపీటీ, ఆర్ఎన్ఆర్, జై శ్రీరాం వంటి రకాలు మిల్లింగ్ చేసి సొంత బ్రాండ్తో విక్రయించాలని యోచిస్తోంది. సూపర్ మార్కెట్లు, కిరాణా, రేషన్ షాపులలో కూడా వీటిని అందుబాటులో తీసుకురానున్నారు. ఏపీఎల్ కార్డుదారులకు మార్కెట్ ధర కంటే కాస్త తక్కువకే ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు మించి సన్న వడ్లు ఉత్పత్తి అవుతుండటంతో.. మిగులు ధాన్యాన్ని వినియోగించుకోవడానికి పౌరసరఫరాల సంస్థ వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది. మిగులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి నాణ్యమైన బియ్యంగా 'తెలంగాణ బ్రాండ్' పేరుతో మార్కెట్లోకి విడుదల చేయాలని డిసైడ్ అయింది.
ముఖ్యంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్, జై శ్రీరాం వంటి అధిక డిమాండ్ ఉన్న సన్నబియ్యం రకాలను మిల్లింగ్ చేసి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రకం బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రత్యేకంగా నిల్వ చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో తెలంగాణలోని కొనుగోలు కేంద్రాలకు భారీ మొత్తంలో సన్నధాన్యం చేరింది. యాసంగి పంటతో పోలిస్తే వానాకాలం పంటలో నూకలు తక్కువగా వస్తాయి. బియ్యం నాణ్యత మెరుగ్గా ఉంటుంది. వానాకాలం బియ్యాన్నే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇది రైతులకు మంచి మద్దతు ధర లభించడానికి, అధిక దిగుబడికి ప్రోత్సాహం అందిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ బ్రాండ్ బియ్యాన్ని కేవలం సూపర్మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లోనూ విక్రయించనున్నారు. ప్రస్తుతం ఆహార భద్రత కార్డు (తెల్లకార్డు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికి త్వరలో కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏపీఎల్ కార్డుదారులు తమకు అవసరమైన 'తెలంగాణ బ్రాండ్' బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా మార్కెట్ ధరతో పోలిస్తే కాస్త తక్కువకే కొనుగోలు చేసేందుకు వీలు కల్పించనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో పొందడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విక్రయించే బియ్యానికి ధర ఎంత నిర్ణయించాలన్న విషయంపై అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్నబియ్యం ధరలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
భారత ఆహార సంస్థ (FCI)కి ధాన్యాన్ని విక్రయిస్తే డబ్బులు రావడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది. కానీ తెలంగాణ బ్రాండ్తో బియ్యాన్ని నేరుగా విక్రయించడం ద్వారా త్వరగా ఆదాయం పొందవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ బియ్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ విస్తృత ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తెలంగాణ బ్రాండ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుందని అధికారులు భావిస్తున్నారు.