ముప్పు ముంగిట్లో శ్రీశైలం జలాశయం
The threat has loomed large due to the lack of repairs to the Srisailam reservoir.;
తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయానికి సమయానికి మరమ్మతులు చేయకపోవడంతో ముప్పు ముంగిట్లోకి చేరుకుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే అపారమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. కృష్ణానది ప్రవాహం ఆధారంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం నిర్మించారు. శ్రీశైలం జలాశయంలో నీటి ద్వారా విద్యుతు ఉత్పత్తి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేస్తారు.
ఈ జలాశయం ఆధారంగా వేలాది ఎకరాలలో పంటలు పండుతున్నాయి. రెండు కొండల మధ్య శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారు. ఇక్కడ కృష్ణానది నీరు గ్రావిటీ ఆధారంగా కిందికి సరఫరా అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టులో నీరు శ్రీశైలానికి.. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సరఫరా అవుతుంది.. శ్రీశైలం నిండితే రెండు తెలుగు రాష్ట్రాలలో పంటలకు ఇబ్బంది ఉండదు. పైగా నాగార్జునసాగర్ కు ప్రధాన నీటి వనరుగా శ్రీశైలం జలాశయం ఉంది.
శ్రీశైలం జలాశయం ఒకప్పుడు లోతుగా ఉండేది. గత కొంతకాలంగా జలాశయంలో పూడిక తీయకపోవడంతో నిల్వనీటి సామర్థ్యం తగ్గింది. వర్షాకాలంలో వరదలు వచ్చినపుడు ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. మార్చి నెల వచ్చేసరికి ప్రాజెక్టు నిండుకుంటున్నది. దీనివల్ల వేసవికాలంలో తాగునీటికీ ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించాలని ఎప్పటినుంచో విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీరు విడుదల చేసే క్రమంలో డ్యామ్ గేట్లు తెరుస్తారు. ఆ సమయంలో నీళ్లు సరఫరా అయ్యే చోట భారీగా గొయ్యి ఏర్పడింది. దీన్ని నీటిపారుదల శాఖ పరిభాషలో "ప్లంజ్ పూల్" అని పిలుస్తుంటారు. వాస్తవానికి ఈ గుంత దశాబ్దల క్రితమే మొదలైంది. 2009 వరదలకు ఏకంగా తాటి చెట్టు అంత లోతు పెరిగింది. దీంతో ప్రాజెక్టు పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంత సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తల బృందం కొద్ది రోజుల క్రితం నుంచి సర్వే చేస్తోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేనిపక్షంలో జలాశయం పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
పరిస్థితి అక్కడిదాకా వచ్చే కంటే ముందే మేల్కోవడం మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో కృష్ణా నదికి వరదలు వచ్చాయి. ఆ సమయంలో నీరు అధికంగా రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి నీరు బయటికి వచ్చింది. నాటి ఘటనలో కర్నూలు జిల్లా మొత్తం మునిగిపోయింది. నష్టం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. ఆ తర్వాత ఆ స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు రాకపోయినప్పటికీ.. ప్రాజెక్టు పైనుంచి వచ్చే నీటి వల్ల ఏర్పడిన ఫ్లంజ్ పూల్ కు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైనది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉండడంతో ఎక్కువగా ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది.