తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభతరం
Registration process in Telangana made easier;
తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధార్-ఈ సంతకం విధానం అమలు చేయనుంది. తొలుత ఆర్మూర్, కూసుమంచి కార్యాలయాల్లో ఆధార్ -ఈ సంతకం అమలు కానుంది.అవినీతిరహితంగా, పారదర్శకంగా, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆధార్ -ఈ సంతకం విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలులోకి తీసుకువరావాలని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశివంచారు.
ఈ ఆధార్-ఈ సంతకం వల్ల 10 నుంచి 15 నిముషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్తో కలిసి.. స్లాట్ బుకింగ్ విధానం, పనిభారం అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్ల పోస్టింగ్, పదోన్నతి పొందిన ఉద్యోగులకు పోస్టింగ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్తోపాటు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా.. ఆధార్-ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపథ్యంలో.. ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పొంగులేటి అధికారులకు సూచించారు. పఠాన్చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా ఎస్ఆర్వోలను నియమించారు. అవినీతి లేకుండా.. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ.. ప్రభుత్వ పేరు ప్రతిష్టలు పెంచే విధంగా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలని శ్రీనివాస రెడ్డి సూచించారురిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం.. స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 47 చోట్ల విజయవంతంగా అమలు కావటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మంచి ఫలితాలు రావడంతో మే 12వ తేదీ నుంచి 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేశారు. ఈ రెండు విడతలు కలిపి.. 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందని మంత్రి పొంగులేటి వివరించారు.