మహానాడులో చంద్రబాబు డ్రామా - జగన్

TDP Telugu Drama Party;

Update: 2025-05-28 11:38 GMT

రాష్ట్రంలో ఎక్కడా ఏదీ వదలకుండా తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ సిపి అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 273వేల కోట్లు కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేశామని వెల్లడించారు. మండపేట, గొల్ల ప్రోలు, పెనుగొండ, మదనపల్లె స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి రావల్సిన అదాయాన్ని చంద్రబాబు దోచుకోవడంతో రాష్ట్ర ఆదాయం తగ్గింది. దేశం మొత్తం 13 శాతం పెరిగితే రాష్ట్రంలో కేవలం 3 శాతమే పెరిగింది. తెలుగుదేశం నేతలు దోచుకోవడం వల్లే రాష్ట్ర ఆదాయం తగ్గింది.

నమ్మించి మోసం చేసే చంద్రబాబును రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే ఎక్కడికి వెళతాడో తెలియని పరిస్థితి ఎదురుకాబోతోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పాడు . ఇప్పుడు మన పార్టీ ఇన్‌ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారు.

జగన్ 2.0 లో ఈసారి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధితోపాటు కార్యకర్తలు, నేతల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అధికార పక్షం నుంచి వస్తున్న ఇబ్బందుల్ని రాసుకొని పెట్టుకొండి. వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని జగన్ హెచ్చరించారు. చేసినవాళ్లతోపాటు వాళ్లతో కుట్రలు పన్నిన వారిని సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని సవాల్ చేశారు.

న్యాయంగా, ధర్మంగా పాలన చేసి ప్రజలకు మేలు చేస్తాం. రాజకీయాలను భ్రష్టుపట్టించే పని చంద్రబాబు పాలనలో సాగుతోంది. ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

కొవిడ్ సమయంలో ఎన్ని సమస్యలు ఉన్నా మానిఫేస్టోలో పేర్కొన్న ప్రతీ హామీ అమలు చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సిపి పాలనలో జరిగింది. దీంతో ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది.

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లక్ష్యంగా వైసిపి పనిచేసింది.

ఎన్నికలు జరిగి ఏడాది అయింది. కళ్లు మూసి తెరిచే లోగా మూడేళ్లు గడిచిపోతుంది. మహానాడు పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను గడప గడపకు తిప్పే ధైర్యం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది? సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు. చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు

సూపర్ సిక్స్ అమలు దాఖలా లేదు. తక్కువ ఖర్చుతో అయిపోయే మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేయటం లేదు. మహిళలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. నాసిరకం ఆహారం అందిస్తున్నారు.

నాడు నేడు పనులు నిలిచిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియెంబర్స్ మెంట్ లేదు. ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది. రాష్ట్రంలో రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావటం లేదు. ఎంఎస్పి ఇచ్చి పంటలు కొనే పరిస్థితి లేదు. ప్రతి ఎకరాకు పదివేలు అదనంగా ఇచ్చిన ఘనత వైసిపిలో జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దళారీల పాలైంది. ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారు. మాజీమంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మీద తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారు.

Tags:    

Similar News