వంద రోజులుగా జైల్లోనే వల్లభనేని వంశీ
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు;
విజయవాడ, మే 20 (పొలిటెంట్ న్యూస్)
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఆయనపై వరుస పెట్టి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే.. మరో కేసు నమోదు చేస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగానే ఉండిపోవాల్సి వస్తోంది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ పరిస్థితిని తలచుకొని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అదే సమయంలో వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను తలచుకొని ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజకీయాల విషయంలో కీలక నిర్ణయానికి వచ్చారు. బెయిల్ లభించిన వెంటనే ఆయన ఓ ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ కామెంట్స్ పై పశ్చాత్తాపం.. గన్నవరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. 2014లో తొలిసారిగా గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రెండోసారి ఆయనకే ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. జగన్ ప్రభంజనంలో సైతం వల్లభనేని వంశీ మోహన్ టిడిపి అభ్యర్థిగా గెలిచారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు వల్లభనేని వంశీ మోహన్. సుమారుగా 100 రోజులపాటు జైల్లో ఉండి అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో న్యాయ సాయం అందడం లేదని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం తన వ్యక్తిగతంగా దెబ్బతిన్నానని.. నాడు తాను ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలుస్తోంది.గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి, అక్కడ పనిచేస్తున్న సత్య వర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ వంటి కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఫిబ్రవరి 13న హైదరాబాదులో వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేశారు. అప్పటినుంచి కేసు మీద కేసులు పెడుతూనే ఉన్నారు. మొత్తం ఆరు కేసులు పెట్టారు. అందులో ఐదు కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఇంతలో నకిలీ ఇళ్లపట్టాలకు సంబంధించి కేసు నమోదు చేశారు. దీంతో ఆయన రిమాండ్ మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అయితే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. లాయర్లతో వంశీ మోహన్ భార్య స్వయంగా మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ కోసం ఇంత చేస్తే.. అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంపై వల్లభనేని వంశీ మోహన్ ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు గన్నవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దుట్టా రామచంద్ర రావు కుమార్తెకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వల్లభనేని వంశీ మోహన్ లో మరింత మనస్థాపం పెరిగినట్లు సమాచారం. తనకు మాట మాత్రం చెప్పకుండా నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి ఎలా అప్పగిస్తారని లోలోపల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బెయిల్ పై విడుదలైన వెంటనే ఒక ప్రకటన జారీ చేయాలని వంశీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ప్రభావాన్ని కోల్పోయారు. తన ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీరు కారణమని వల్లభనేని వంశీ మోహన్ ఆరోపించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే వల్లభనేని వంశీ మోహన్ లో రియలైజేషన్ కనిపిస్తోంది. తీవ్ర నిర్ణయం దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.