యోగా ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్పవరం

Update: 2025-05-21 10:13 GMT
  • యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోడీదే
  • ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
  • విశాఖ వేదికగా జూన్ 21న ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షల మందితో కార్యక్రమం
  • రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమంది యోగాలో పాల్గొనేలా సంకల్పించామన్న సీఎం

అమరావతి, మే 21(పొలిటెంట్ న్యూస్) :- ప్రపంచానికి భారత దేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సీయం చంద్రబాబు సచివాలయంలో మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారని తెలిపారు. నేటి నుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తామని ప్రకటించారు. జూన్ 21న ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షలమందితో కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్ సైట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. యోగా అనేది ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినది కాదని ప్రపంచంలో అన్ని దేశాల్లో, మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమమని అన్నారు. ప్రధాని మోదీ దీక్షతో, పట్టుదలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనవంతుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీయం చంద్రబాబు ఆంధ్రప్రజలకు పిలుపునిచ్చారు.

యోగాపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం

ప్రధాని మోదీ ప్రపంచమంతా యోగాను ప్రమోట్ చేస్తున్నప్పుడు మనమూ బాధ్యతతో ప్రమోట్చేయాలని చంద్రబాబు అన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా కూడా చొరవ తీసుకుని యోగాను ప్రమోట్ చేయాలని కోరారు. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో అసోసియేట్ చేసుకుని 2 వేలమంది యోగా శిక్షకులను తయారుచేస్తామని చెప్పారు. పాఠశాలలో రెండు వేల మందిని తయారుచేస్తామన్నారు. స్కూల్ సిలబస్ లో యోగా ప్రాముఖ్యత తెలిపేలా పెడతామని తెలిపారు. స్కూళ్లు మొదలవగానే గంట సేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. యోగా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాలంటీర్లకు జూన్ 21న ప్రధాని సభలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు ఈసందర్భంగా ఆఫర్ ఇచ్చారు.

Tags:    

Similar News