Asia Cup Handshake Controversy: ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలపడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడటంపై విమర్శలు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ఆటగాళ్లు వెల్లడించారు.

మ్యాచ్ రిఫరీపై పీసీబీ ఆగ్రహం

ఈ ఘటనకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కారణమని పీసీబీ ఆరోపించింది. పైక్రాఫ్ట్‌ను వెంటనే తొలగించాలని పీసీబీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. లేకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించింది. "టాస్ సమయంలో భారత కెప్టెన్‌తో కరచాలనం చేయవద్దని పైక్రాఫ్ట్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు" అని పీసీబీ పేర్కొంది. ఈ కారణంగానే ఇద్దరు కెప్టెన్ల మధ్య టీమ్ షీట్ల మార్పిడి జరగలేదని పాక్ మేనేజర్ నవీద్ చీమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు.

భవిష్యత్‌లో కూడా కరచాలనం ఉండదు

పీసీబీ ఆరోపణలపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. అయితే ఆసియా కప్ టోర్నమెంట్ అంతా పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయకూడదని భారత జట్టు నిర్ణయించుకుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మరో రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని సమర్థించారు.

అంతర్జాతీయ క్రీడల్లో ఇలాంటివి కొత్తేమీ కాదు

రాజకీయ కారణాలతో ప్రత్యర్థి ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అంతర్జాతీయ క్రీడల్లో కొత్తేమీ కాదు. 2023 వింబుల్డన్ మహిళల సింగిల్స్ మ్యాచ్ తర్వాత బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకాతో ఉక్రెయిన్ ప్లేయర్ స్వితోలినా కరచాలనం చేయడానికి నిరాకరించింది. రష్యా, బెలారస్ తమ దేశంపై దాడి చేస్తున్నందున ఆ దేశాల ఆటగాళ్లతో తాను చేతులు కలపనని స్వితోలినా చెప్పింది. అప్పుడు వింబుల్డన్ నిర్వాహకులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Tags: