Asia Shooting Championship: ప్రస్తుతం కజకిస్థాన్‌లోని షిమ్కెంట్ నగరంలో 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ 2025 జరుగుతోంది. ఈ పోటీలు ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 30 వరకు కొనసాగుతాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

నిన్నటి వరకు (ఆగస్టు 21) భారత్ మొత్తం 26 పతకాలతో (14 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలు) పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల స్కీట్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నారూకా స్వర్ణ పతకం సాధించాడు. ఇది ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన మొదటి సీనియర్ విభాగపు స్వర్ణం.

రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా, కిరణ్ జాదవ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఈ ముగ్గురూ కలిసి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ కాంస్య పతకం గెలుచుకుంది.

జూనియర్ షూటర్లు అదుర్స్

మహిళల జూనియర్ స్కీట్ విభాగంలో మాన్సీ రఘువంశీ స్వర్ణం గెలవగా, యశస్వీ రాథోడ్ కాంస్యం సాధించింది.జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్ ప్రపంచ , ఆసియా రికార్డులను సృష్టించి స్వర్ణాన్ని గెలుచుకుంది. అభినవ్ షా జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించాడు.సౌరభ్ చౌదరి, సురుచి సింగ్ ద్వయం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 129 మంది భారతీయ షూటర్లు సీనియర్, జూనియర్ విభాగాల్లో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ షూటర్లకు ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రాబోయే అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది.

Tags: