Indian all-rounder Krishnappa Gowtham: భారత ఆల్‌రౌండర్,కర్ణాటక స్టార్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.37 ఏళ్ల గౌతమ్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్ లో 2021లో శ్రీలంకతో జరిగిన ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడారు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీశారు.

2021 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇతడిని రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన 'అన్‌క్యాప్డ్' (భారత జట్టుకు ఆడని) ఆటగాడిగా గౌతమ్ రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ,లక్నో సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు.కర్ణాటక తరఫున ఆడుతూ అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 394 వికెట్లు తీశారు, 2,783 పరుగులు చేశారు.

కృష్ణప్ప గౌతమ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (KPL) ప్రదర్శన. బళ్లారి టస్కర్స్ తరఫున ఆడుతూ ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 134 పరుగులు (కేవలం 56 బంతుల్లో) చేశారు.

బౌలింగ్‌లో 8 వికెట్లు తీశారు.టీ20 క్రికెట్ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన మరే ఆటగాడూ చేయలేదు. ప్రస్తుతం ఆయన కన్నడ భాషలో క్రికెట్ కామెంటేటర్‌గా రాణిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా కోచింగ్ లేదా కామెంటరీ రంగంలోనే కొనసాగే అవకాశం ఉంది.

Tags: