Nitish Kumar Reddy Out, Dhruv Jurel Joins the Squad: నితీష్ కుమార్ రెడ్డి ఔట్.. జట్టులోకి ధ్రువ్ జురెల్!
జట్టులోకి ధ్రువ్ జురెల్!
Nitish Kumar Reddy Out, Dhruv Jurel Joins the Squad: దక్షిణాఫ్రికాతో శుక్రవారం (నవంబర్ 14) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్కు ముందు, యువ ఆల్-రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని భారత టెస్టు స్క్వాడ్ నుంచి విడుదల చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. అయితే, నితీష్ సీనియర్ జట్టుకు దూరమైనప్పటికీ, త్వరలోనే అతను ఇండియా 'ఎ' జట్టులో చేరనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, దక్షిణాఫ్రికా 'ఎ' జట్టుతో రాజ్ కోట్లో జరిగే మూడు మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్ కోసం ఇండియా 'ఎ' జట్టులో చేరనున్నాడు. ఇటీవల కొన్ని గాయాల కారణంగా నితీష్ సరైన మ్యాచ్ ఫిట్నెస్ పొందలేకపోయాడు. దీంతో, ఆటగాడికి మరింత ఎక్కువ గేమ్ టైమ్ ఇచ్చే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా 'ఎ' వన్డే సిరీస్ ముగిసిన వెంటనే, నితీష్ కుమార్ రెడ్డి గువాహతిలో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్కు భారత సీనియర్ జట్టుతో తిరిగి కలుస్తాడని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టులో ఇప్పటికే సీనియర్ ఆల్-రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అందుబాటులో ఉండటం, అలాగే అద్భుత ఫామ్లో ఉన్న ధ్రువ్ జురెల్ జట్టులో భాగమయ్యే అవకాశం ఉండటంతో, నితీష్ను ఇండియా 'ఎ' జట్టులోకి పంపాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. దక్షిణాఫ్రికా 'ఎ' వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి 19 వరకు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది. 2వ టెస్ట్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనుంది. భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ సీనియర్ జట్టులోకి వచ్చి అద్భుత ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.