Aaqib Javed: ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రకటించిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హై-పెర్ఫార్మెన్స్ ఆకిబ్ జావేద్ ఒక కీలకమైన, ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ జట్టుకు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినా, భారత్‌ను ఓడించే సత్తా ఈ జట్టుకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఈ జట్టుకు ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉంది. మనకు నచ్చినా, నచ్చకపోయినా, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్. ఈ విషయం ప్రతి ఆటగాడికి తెలుసు" అని జావేద్ అన్నారు. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని, ప్రస్తుత పరిస్థితులు వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ వంటి వారిని జట్టు నుంచి తప్పించినా, వారికి భవిష్యత్తులో అవకాశం ఉంటుందని, ఈ కొత్త జట్టులో యువత, అనుభవం కలగలిపి ఉన్నాయని ఆయన తెలిపారు. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత, రెండు జట్లు సూపర్‌-4 దశకు చేరుకుంటే, మరోసారి తలపడే అవకాశం ఉంది. అలాగే, ఫైనల్‌లో కూడా కలుసుకోవచ్చు. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Tags: