Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వరుస పరాజయాలు కోలుకోలేని దెబ్బగా మారుతున్నాయి. ఇంగ్లండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో కోల్పోయిన పాకిస్థాన్.. ఐసీసీ పురుషుల టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లో చరిత్రలోనే అత్యంత దిగువ స్థానానికి పడిపోయింది. తొలిసారి తొమ్మిదో స్థానానికి చేరిన పాకిస్థాన్.. ప్రస్తుతం జింబాబ్వే కంటే మాత్రమే ముందుంది. టెస్టు మ్యాచ్‌లు చాలా తక్కువగా ఆడుతున్న జింబాబ్వే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా భాగం కాకపోవడం గమనార్హం.

పాకిస్థాన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో గతంలో అత్యల్పంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2024 సెప్టెంబర్‌లో సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో 2-0తో టెస్టు సిరీస్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అప్పట్లో పాకిస్థాన్ రేటింగ్ పాయింట్లు 76కు తగ్గాయి. 1965 తర్వాత ఇదే వారి అత్యల్ప రేటింగ్‌గా నిలిచింది. అయితే తగినన్ని మ్యాచ్‌లు ఆడకపోవడంతో కొంతకాలం రేటింగ్ పాయింట్లు లేని పరిస్థితిని మినహాయిస్తే.. అప్పటి పతనం పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత పాకిస్థాన్ రేటింగ్ పాయింట్లు మరో ఐదు తగ్గి 71కి చేరాయి. ఇది ఆ జట్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప రేటింగ్ పాయింట్లు. మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 194 పరుగుల తేడాతో గెలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టులోనూ పాకిస్థాన్ 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఈ సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా బంతి స్వింగ్ అవుతున్న పరిస్థితుల్లో వారి బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. మూడో టెస్టులో పాకిస్థాన్ కొంత పోరాటం చూపించినప్పటికీ.. అక్కడి పిచ్ మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటమే అందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సొంత దేశంలోనూ పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తమ జట్టుకు సరైన ప్రాక్టీస్ కూడా కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టెస్టు ర్యాంకింగ్స్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 పట్టికలోనూ పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఐసీసీ 11 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించడంతో పాకిస్థాన్ తొమ్మిదో స్థానానికి, అంటే పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల శాతం కేవలం 4.63గా ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ పాయింట్ల శాతం 20.83గా ఉండటంతో పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. వరుస పరాజయాలు, ర్యాంకింగ్స్‌లో పతనం, డబ్ల్యూటీసీలో చివరి స్థానం.. ఇలా పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థకు ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొంది.

Tags: