Indian Team Head Coach Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్‌ను బతికించుకోవాలంటే, దేశంలో స్పిన్నర్లకు మాత్రమే కాకుండా ఫాస్ట్ బౌలర్లకు కూడా అనుకూలించే వికెట్లను తయారు చేయాల్సిన అవసరం ఉందని గట్టిగా డిమాండ్ చేశారు. ఇటీవల అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించినప్పటికీ, పిచ్ నాణ్యతపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

"నేను ఈ పిచ్ కంటే మెరుగైన వికెట్ ఉంటుందని ఆశించాను. అవును, మేము ఐదవ రోజు ఫలితం సాధించాం. కానీ, ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్లకు తగిలే అంచులు క్యారీ అవ్వాలి (క్యాచ్‌గా వెళ్లాలి). వికెట్‌పై పేసర్లకు కూడా ఏదో ఒక సహకారం లభించాలి" అని గంభీర్ స్పష్టం చేశారు.

టెస్ట్ క్రికెట్ ఉనికిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గంభీర్ నొక్కి చెప్పారు. "మేము స్పిన్నర్ల గురించి తరచుగా మాట్లాడుతుంటాం. కానీ, మీ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్నప్పుడు, వారికి కూడా ఆటలో పాలు పంచుకునే అవకాశం దక్కాలి. టెస్ట్ క్రికెట్‌ను సజీవంగా ఉంచాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా మంచి పిచ్‌లపై ఆడటం ముఖ్యం" అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags: