Board of Control for Cricket in India: టీ20 వరల్డ్ కప్ విజేతలకు 131 కోట్ల భారీ నజరానా: బీసీసీఐ ప్రకటన

బీసీసీఐ ప్రకటన

Update: 2026-03-10 11:51 GMT

Board of Control for Cricket in India: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాకు 131 కోట్ల రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు బీసీసీఐ మంగళవారం తెలిపింది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రకటించిన 125 కోట్ల కంటే ఇది 6 కోట్లు ఎక్కువ కావడం విశేషం.

ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడుసార్లు (2007, 2024, 2026) టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా అవతరించడమే కాకుండా, వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేసి, 96 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్నారు.

ఈ టోర్నీలో సంజూ శాంసన్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును దక్కించుకున్నారు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు సార్లు 80కి పైగా పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో 89 పరుగులు చేసిన శాంసన్, ఒకే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు (321) చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగమించారు. అలాగే బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో 4 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు.

గత రెండేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే వరల్డ్ కప్ మరియు అండర్-19 వరల్డ్ కప్‌లను గెలుచుకుని భారత్ ప్రస్తుతం ఐదు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను తన వద్ద ఉంచుకుంది. ఇప్పుడు భారత జట్టు ముందున్న తదుపరి లక్ష్యం 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్. ఒకవేళ అది కూడా గెలిస్తే, ఒకే సమయంలో ప్రధానమైన అన్ని ఐసీసీ ట్రోఫీలను కలిగి ఉన్న అరుదైన జట్టుగా భారత్ నిలుస్తుంది.

Tags:    

Similar News