Telangana Girl Shines: దివ్యాంగుల ప్రపంచ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి సత్తా
తెలంగాణ అమ్మాయి సత్తా
Telangana Girl Shines: దివ్యాంగుల కోసం థాయ్లాండ్లో నిర్వహించిన ప్రపంచ ఎబిలిటీ క్రీడల్లో తెలంగాణకు చెందిన యువ షూటర్ బానోత్ పావని అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్4 - 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ మిక్స్డ్ విభాగం ఫైనల్స్లో పావని 225.1 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్లోనూ 623 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్న ఈ యువ షూటర్, ఫైనల్లోనూ రాణించి పోడియంపై నిలిచింది.
ఈ విభాగంలో థాయ్లాండ్కు చెందిన కున్తాంగ్ (251.7) స్వర్ణం, చైచామ్నన్ (249.6) రజతం గెలుచుకున్నారు. 17 ఏళ్ల పావని హైదరాబాద్లోని రహ్మత్పురలో ఉన్న ఆదిత్య మెహతా ఫౌండేషన్లో శిక్షణ తీసుకుంటోంది. పారాలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే ఆమె అంతిమ లక్ష్యమని కోచ్ విజయ్ సింహం తెలిపారు.