Ashada Bonalu: జంటనగరాల్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఆదివారం (ఆగస్టు 9) అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తజన సందోహం కనిపించింది. మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి తలపై బోనాలు పెట్టుకొని, పిల్లలు ఆటబొమ్మలు, బుడగలతో కేరింతలు పెట్టుతూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బంగారు బోనం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా ఆలయాన్ని సందర్శించి బంగారు బోనం సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

మొక్కుల్లో భాగంగా కోళ్లు, యాటలు తెగాయి. డోలు, సన్నాయిల నడుమ శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. చెర్నాకోలలతో పోతరాజులు విన్యాసాలు చేశారు. దారిపొడుగునా భారీ హోర్డింగులు, ప్రత్యేక వేదికలపై జానపద నృత్యాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, డీజేల్లో అమ్మవారి పాటలు భక్తులను కట్టిపడేశాయి. ఆలయం ప్రత్యేక అలంకరణలో మెరిసింది.

హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి, అంబర్‌పేట మహంకాళి, చిలకలగూడ కట్టమైసమ్మ, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, ఉప్పుగూడ మహంకాళి, మీరాలమండి మహంకాళి, బేగంబజార్‌ భూలక్ష్మీమాత, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి, బోరబండ పోచమ్మ, ఎల్బీనగర్‌ ఖిల్లా మైసమ్మ తదితర ఆలయాల్లోనూ ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అనేక ఆలయాలకు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ వెంకటస్వామి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, బోనాలు సమర్పించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సినీ నటుడు విజయ్‌ దేవరకొండ (తన కొత్త సినిమా విజయం కోసం అమ్మవారిని కోరుకున్నారు) తదితర ప్రముఖులు వివిధ ఆలయాలను దర్శించి పూజలు చేశారు. హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ లాల్‌దర్వాజా ఆలయంలో పూజలు చేసి భారీ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా భాగ్యనగరం అంతా బోనాల కోలాహలంతో హోరెత్తింది.

Tags: