Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పూర్తి కట్టుబాటు: బండి సంజయ్
బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టు విషయంలో కిషన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి లేదని, అర్థంలేని ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదని, ‘సర్’ విషయంలో కాంగ్రెస్ గందరగోళం చేస్తోందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ వాళ్లకు ఓటు ఇవ్వాలా అని ప్రశ్నించిన ఆయన, ఇతర దేశాల వారి ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు.
మావోయిస్టుల విషయంలో కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు చివరికి ఏమీ సాధించలేదని, తుపాకీ గొట్టంతో అమాయకులు, మైనర్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. చివరికి మావోయిస్టు సంస్థను నిషేధానికి గురి చేశారని, అనేక మంది లొంగిపోయారని చెప్పారు. మావోయిస్టులు ఇక లేరని, తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేమని మావోయిస్టు అగ్రనేతలు కూడా గుర్తించారని బండి సంజయ్ పేర్కొన్నారు. మావోయిస్టు భావజాలంతో ఏదైనా సాధిద్దామని ఆలోచిస్తున్న వారు ఆ ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధృవీకరించారు.