CM Revanth Reddy Aims: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Aims: ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గృహనిర్మాణం, పట్టణ అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ రోడ్లను కలిపి త్రీ-లెవెల్ విధానాన్ని అమలు చేయాలి. ట్రాఫిక్ సమస్యలకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే పరిష్కారం కాదు. మల్టీ-ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను బలోపేతం చేయాలి” అని వివరించారు.
పార్కింగ్ సమస్యలను పరిష్కరించడానికి మల్టీ-లెవెల్ పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని మూడు భాగాలుగా (క్యూర్, ప్యూర్, రేర్) విభజించి పనులు చేపట్టామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెలుపలి ప్రాంతాలను సర్వీస్ సెక్టార్గా, ORR బయటి-ఆర్ఆర్ఆర్ లోపలి ప్రాంతాలను తయారీ రంగంగా, ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలను వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘తెలంగాణ రైజింగ్-2047’ మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.