CM Revanth Reddy: మక్తల్లో ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించిన సీఎం రేవంత్
సీఎం రేవంత్
CM Revanth Reddy: పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి పర్యటన చేపట్టారు.
ఈ పర్యటనలో భాగంగా నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కాట్రేవులపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. వారితో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం వివిధ అంశాలపై చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం, మంత్రులు తిలకించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురు, శుక్రవారాలు సీఎం పర్యటన కొనసాగనుంది. పాలమూరు-రంగారెడ్డి, మక్తల్-నారాయణపేట్-కొడంగల్, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లు, పంపుహౌస్లు, కాలువలు, డెలివరీ సిస్టర్న్ల పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పూర్తి చేసిన, ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల గురించి సీఎం వివరంగా సమాచారం తీసుకోనున్నారు.
గురువారం మక్తల్ నుంచి ప్రారంభమైన ఈ పర్యటన శుక్రవారం జడ్చర్లలో భారీ బహిరంగ సభతో ముగియనుంది.