Deputy CM Bhatti Vikramarka: విలువైన జీవితాలను డ్రగ్స్‌ బారిన పడి నాశనం చేసుకోవద్దని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా హెచ్చరించారు.

శిల్పకళా వేదికలో ఈగల్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్‌ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లే ప్రభుత్వం కూడా యువతను రక్షించడానికి కృషి చేస్తోందని అన్నారు.

“సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, తమ జీవితాలను రిస్క్‌లో పెట్టి డ్రగ్స్‌ ముఠాలను పట్టుకుంటున్నారు. డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఈగల్‌ ఫోర్స్‌ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించాం. డ్రగ్స్‌ కట్టడికి ఏ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదు” అని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణలో పుట్టి పెరగడం భరోసాగా ఉండే వాతావరణం కల్పించడమే లక్ష్యమని, సమాజంలో మార్పు వచ్చేలా చట్టాలు అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సినీ నటులు ఇచ్చే సందేశాలు సమాజంలో బలంగా ప్రభావం చూపుతాయని కూడా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, డీజీపీ సీవీ ఆనంద్‌, సినీ నటులు రామ్‌ పోతినేని, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ నుంచి యువతను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత

డ్రగ్స్‌ సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలంతా సహకరించాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం యువతలో అవగాహన పెంపొందించడంలో కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు.

Tags: