Formula E-Car Case: ఫార్ములా ఈ-కార్‌ కేసు.. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌ హాజరు.. విచారణ ఆగస్టు 25కి వాయిదా

విచారణ ఆగస్టు 25కి వాయిదా

Update: 2026-07-31 11:34 GMT

Formula E-Car Case: ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏ1గా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్, ఏ3గా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బి.ఎల్.ఎన్. రెడ్డి కూడా సమన్లతో తొలిసారి విచారణకు హాజరై వాటిని కోర్టుకు సమర్పించారు.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్ది సేపు ట్రాఫిక్‌ స్తంభించింది.

ఫార్ములా-ఈ రేస్, ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్‌ఎమ్‌డీఏ నిధుల నుంచి రూ.55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఏసీబీ ఆరోపణ. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చులు చేసి ఆడిట్‌ను తప్పించేందుకు ప్రయత్నించారని, మూడు సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్‌ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనలు, పన్ను విధానాలను ఉల్లంఘించి విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేశారని, పన్నుల రూపంలో ప్రభుత్వంపై రూ.8.06 కోట్ల అదనపు భారం పడిందని ఏసీబీ పేర్కొంది.

కేటీఆర్, అర్వింద్‌ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు అవసరమైన అనుమతులు లభించిన అనంతరం ఛార్జిషీట్‌ దాఖలైంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది.

Tags:    

Similar News