CM Revanth Reddy: భవిష్యత్కు దిక్సూచి: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పునాదులు- ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత, అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ప్రపంచానికి దిక్సూచిగా నిలబెడతాం. హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ ప్రఖ్యాతి ఇక్కడికి కూడా రాబోతోంది అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మాణం జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనాన్ని బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 10 చారిత్రక రోజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “జూన్ 10, 2026ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్నాం. విద్య, వైద్యం, ఏఐ, జీసీసీ, గ్రీన్ ఫార్మా, ఐటీ రంగాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆకర్షించే ప్రణాళికలు సిద్ధం చేశాం. డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పెట్టుబడులను ఆకర్షిస్తాం. స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని పునరుద్ఘాటించారు.
స్థానిక రైతులు, ప్రజల అభ్యర్థన మేరకు ఎఫ్సీడీఏ పరిధిలో కొన్ని గ్రామాలను చేర్చాలని అధికారులకు ఆదేశిస్తూ సీఎం సంతకం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలను చర్చించి చేర్చనున్నట్లు తెలిపారు.
అభివృద్ధికి అడ్డుపడేవారికి హెచ్చరిక
“ఒకాయన ఫామ్హౌస్లో కూర్చుని అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇద్దరిని అమెరికా పంపించారు. వారు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు. రద్దు చేయాలా? విస్తరించాలా? ప్రజలే చెప్పండి. తెలంగాణ ప్రజలు వాళ్లను తిరస్కరించారు. రద్దు చేస్తామంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు. ప్రజలే ఈ నగరాన్ని నిర్మించుకుంటారు” అని సీఎం హెచ్చరించారు.
బంగారం కంటే విలువైన భూములు
హైదరాబాద్ చరిత్రను ఉదాహరించిన సీఎం, కుతుబ్షాహీ, నిజాం కాలం నుంచి సైబరాబాద్ వరకు అభివృద్ధి ఎలా జరిగిందో వివరించారు. రంగారెడ్డి జిల్లా భూముల ధర ఎకరాకు రూ.200 కోట్లు పైగా ఉండటం బంగారం కంటే ఎక్కువ విలువను నిరూపిస్తోందన్నారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులను అప్పుడు వ్యతిరేకించిన వారిని గుర్తు చేశారు.
కబ్జాదారులపై కఠిన చర్యలు
హైదరాబాద్లో ఒక గంట వానకు ట్రాఫిక్ స్తంభించడం, వరద సమస్యను ప్రస్తావించిన సీఎం, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించినవారి కట్టడాలను తొలగిస్తామని హెచ్చరించారు. కూకట్పల్లి, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్లో చెరువుల అభివృద్ధి ఉదాహరణలు ఇచ్చారు. దిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల సమస్యలను పోల్చి, ఫ్యూచర్ సిటీని టోక్యో, న్యూయార్క్, సింగపూర్లతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని ఆకాంక్షించారు.
ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణ యువతకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.