High Court: సాధారణ రెవెన్యూ పనుల్లో జాప్యం వల్ల ఒకే తరహా సమస్యలపై హైకోర్టులో పిటిషన్లు పెరుగుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌లైన్‌ దరఖాస్తులు, రెవెన్యూ రికార్డుల సవరణ, కనిపించని సర్వే నంబర్ల నమోదు, మ్యుటేషన్‌ వంటి అంశాలపై ఎక్కువగా కేసులు దాఖలవుతున్నాయి.

ఈ సమస్యలన్నీ సంబంధిత అధికారులు నిర్ణీత సమయంలోనే పరిష్కరిస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని న్యాయస్థానం అభిప్రాయపడింది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ)ని రూపొందించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయంపై నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలానికి చెందిన హన్మండ్లు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ మంగళవారం విచారణ చేపట్టారు. గత అక్టోబర్‌లో మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, ఎనిమిది నెలలు గడిచినా రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది మాత్రం ఒకే తరహా దరఖాస్తులు వెల్లువెత్తడం వల్ల జాప్యం జరుగుతోందని వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, రెవెన్యూ సేవలు చట్టబద్ధంగా అందించాల్సిన అధికారులు సకాలంలో పనులు చేయకపోవడం వల్ల ప్రజలు కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

ఎస్‌ఓపీ రూపొందించి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేశారు. ఉత్తర్వుల కాపీని బుధవారం లోగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి అందించాలని హైకోర్టు రిజిస్ట్రీకి కూడా సూచించింది.

Tags: