మహేష్‌బాబుతో నటించాలని ఉంది - మిస్‌ ఇండియా నందిని గుప్తా

Update: 2025-05-30 06:57 GMT

తనకు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో కలిసి సినిమాలో నటించాలని ఉందని మిస్‌ ఇండియా నందినీ గుప్తా తన మనసులోని మాటను వెల్లడించారు. తెలుగు సినిమాలంటే తనకు అభిమానమన్నారు. మహానటిలో కీర్తి సురేష్‌ నటన అద్భుతమని కొనియాడారు. పద్మావత్, యే జవాని హై దివాని సినిమాలు ప్రేరణనిచ్చేవన్నారు.

హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన నందిని గుప్తా.. పొలిటెంట్‌ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను తన హృదయంపై భారత్‌ ముద్ర వేసుకున్నానన్నారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన పోరాటాలను, విజయం వెనుక ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వివరించారు.

గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన తాను.. మోడలింగ్ రంగం వైపు అడుగులు వేయడాన్ని మొదట చాలా మంది హేళన చేశారని నందిని గుప్తా గుర్తు చేసుకున్నారు. మీరు చిన్న పట్టణం నుంచి వచ్చారు.. కలల నగరంలో మీకు అవకాశాలుంటాయా? అని అనేకమంది ప్రశ్నించారని చెప్పారు. కానీ, తాను చేయగలనన్న కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లానన్నారు. ఒకప్పుడు తాను మైక్ పట్టుకోవడానికే భయపడి పోయానని, ఇప్పుడు సునాయాసంగా మాట్లాడగలగుతున్నానని నందిని వివరించారు.

మిస్ వరల్డ్ పోటీ భారత్‌లో జరగడం గర్వకారణమని, తనకు రెండవసారి ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈసారి ప్రపంచ సుందరి కిరీటం మన దేశానిదే కావాలని, ఈనెల 31న జరగనున్న ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్నానని, అందులో గట్టెక్కేందుకు అందరి ఆశీర్వాదం కావాలన్నారు.

Tags:    

Similar News