Jupally and Harish Rao: జూపల్లి-హరీశ్రావు మధ్య తీవ్ర మాటల యుద్ధం! అప్పుల లెక్కలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు
సవాళ్లు, ప్రతి సవాళ్లు
Jupally and Harish Rao: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య సవాళ్లు, లేఖలు, మీడియా సమావేశాలతో రాజకీయ వేడి పెరిగిపోతోంది.
శుక్రవారం ఉదయం జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలకు స్పందించిన హరీశ్రావు ఆయనకు లేఖ రాశారు. అప్పుల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని హరీశ్రావు పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని చెబుతోంది. అసెంబ్లీలో సీఎం రూ.3,47,294 కోట్ల అప్పు అని ప్రకటించారు. కానీ ఆధారాలతో నిరూపించినా సీఎం, మంత్రుల తీరు మారడం లేదు. బీఆర్ఎస్ తీసుకున్న రుణాలు కేవలం రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే. నేను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉంటాను. చర్చకు సిద్ధం” అని హరీశ్రావు స్పష్టం చేశారు.
హరీశ్రావు లేఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్పందన ఇచ్చారు. “నేను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాను. తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా. వందలాది మంది త్యాగాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం స్వార్థం కోసం వాడుకుంది. నేను అడిగింది తప్ప హరీశ్రావు లేఖలో ఏదేదో రాశారు. ఇది పలాయనవాదం. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం” అని జూపల్లి విమర్శించారు.
అంతేకాకుండా, “నేను చెప్పే లెక్కలు తప్పు అని కేసీఆర్తో చెప్పించాలి. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదు? అప్పులపై ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ చేసిన అప్పులపై ఈ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తోంది” అని జూపల్లి ఆరోపించారు.
ఈ మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి నింపుతోంది. రెండు పార్టీల మధ్య ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.